
కర్నూలు, 18 మే (హి.స.)
ముస్లింల త్యాగానికి, ఆత్మార్పణకు ప్రతీక అయిన బక్రీద్ పండుగకు ఇంకా వారం రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సందర్భంగా రాయలసీమను రతనాల సీమలోని అనేక జిల్లాల్లో మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల వ్యాపారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలోని చాలా పశువుల మార్కెట్లలో ధరలు పెరిగాయి. గాజులతో ఉన్న పొట్టేళ్లు, మేకలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అందువల్ల, కొన్ని గొర్రెలు, పొట్టేళ్లు, మేకలు లక్ష రూపాయలకు పైగా అమ్ముడయ్యాయి,
కర్నూలు లో ఈ పండగ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రార్ధనలు నిర్వహించే మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే మసీదులు, ఈద్గాలకు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
ఇక బక్రీద్ సందర్భంగా కర్నూలోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి.
ఈ గొర్రెలు, మేకల కొనుగోలు కోసం ముస్లింలు బారులు తీరుతున్నారు. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా వీటి రేట్లు రెట్టింపు అవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే, ధరలు కిలోకు రూ. 100 నుంచి 150 వరకు పెరిగాయి.
బరువు, జాతి, ఆకారాన్ని బట్టి పొట్టేళ్లు, మేకలు కనీసం ₹15,000 నుంచి ₹1.5 లక్షలకు పైగా అమ్ముడవుతున్నాయి. ఈ పండుగ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊపు లభించింది. కర్నాటక లోని సింధనూరులో గొర్రెలు, మేకల రేట్లు రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఒక్కో మేక రూ.50,000 నుంచి రూ.7,50,000 వరకు అమ్ముడవుతున్నాయి.
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, గొర్రెల కాపరులు గొర్రెలు, మేకలను ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముతున్నారు. పొరుగు జిల్లాల నుంచి ముస్లింలు, వ్యాపారులు కూడా గొర్రెలను కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించడానికి వచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV