ప్రభుత్వానికి షాక్.. కేబీఆర్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
ప్రభుత్వానికి షాక్.. కేబీఆర్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
సుప్రీం కోర్ట్


హైదరాబాద్, 18 మే (హి.స.)

హైదరాబాద్ మహానగరానికి

ఊపిరితిత్తులుగా ఉన్న కేబీఆర్ జాతీయ పార్కు చుట్టుపక్కల చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సోమవారం కీలక స్టే విధించింది. రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం చెట్లను నరికివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పార్క్ చుట్టూ ఉన్న 25 నుంచి 35 మీటర్ల పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో (ఎకో-సెన్సిటివ్ జోన్ - ESZ) ఎలాంటి చెట్లను నరకడానికి వీల్లేదని జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారంలో మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పర్యావరణ సామాజిక కార్యకర్త కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. సుప్రీంకోర్టు స్టే తో SRDP పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 లోని సెక్షన్ 35 కింద నోటిఫై చేయబడిన కేబీఆర్ నేషనల్ పార్క్ అత్యంత సున్నితమైన పట్టణ అటవీ ప్రాంతమని పిటిషనర్ కోర్టుకు వివరించారు. మొదట ఈ పార్క్ చుట్టూ 25 నుంచి 35 మీటర్ల మేర పర్యావరణ సున్నిత ప్రాంతాన్ని (Buffer Zone) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారని, అయితే వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (SRDP) వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఈ పరిధిని 3 మీటర్ల నుంచి 29.8 మీటర్లకు దారుణంగా తగ్గించేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇంత తక్కువ బఫర్ జోన్ ఉండటం వల్ల జాతీయ పార్కుకు బాహ్య శబ్దాలు, కాలుష్యం నుంచి లభించే రక్షణ పూర్తిగా దెబ్బతింటుందని, ఇది పర్యావరణ చట్టాల ఆశయానికే విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ తగ్గింపుపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2020 అక్టోబర్ 27న జారీ చేసిన తుది నోటిఫికేషన్ ను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

బఫర్ జోన్ పరిధిని తగ్గించడం వెనుక ఎలాంటి శాస్త్రీయ లేదా పర్యావరణ అంచనాలు లేవని, కేవలం భూసేకరణ ఖర్చులను తప్పించుకోవడానికి, రోడ్డు ప్రాజెక్టుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పర్యావరణ రక్షణ తగ్గింపును వ్యతిరేకిస్తూ దాదాపు 19,000 మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిని అధికారులు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా.. ఈ నోటిఫికేషన్ ఖరారు చేయడానికి ముందు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించనప్పటికీ, నిర్వహించినట్లుగా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని పిటిషన్లో ఆరోపించారు.

కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాల వల్ల పర్యావరణానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతోందని, అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్ తెలిపారు. అయితే, హైకోర్టు మార్చి 31, 2026 నాటి తన ఉత్తర్వుల్లో తక్షణ ఉపశమనం ఇవ్వకుండా.. ఈ జోన్లో ఏయే కార్యకలాపాలకు అనుమతి ఉందో పరిశోధన చేయాలంటూ పిటిషనర్లనే ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, పర్యావరణాన్ని కాపాడటం అత్యంత ఆవశ్యకమని భావిస్తూ తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు చెట్ల నరికివేతపై తక్షణ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 27వ తేదీకి వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande