
హైదరాబాద్, 18 మే (హి.స.)
నగంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో
ఒకటైన ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించే వాహనదారులకు అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు గాను ఉప్పల్ రింగ్ రోడ్డు పరిధిలో రాకపోకలు తాత్కాలికంగా నిషేధించారు. నేటి నుంచి రాబోయే మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వరంగల్ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. వరంగల్ వైపు నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలను మెహెఫిల్ హోటల్ వద్ద దారి మళ్లిస్తారు. ఈ వాహనాలు ఉప్పల్ భగాయత్ మీదుగా నాలోల్ సర్వీస్ రోడ్డుకు చేరుకుని, అక్కడి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని నగరంలోకి ప్రవేశించాల్సి ఉంది. ఇక హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే చిన్న వాహనాలు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్దనున్న పిస్తా హౌజ్ పక్కనుంచి బీరప్పగడ్డ మీదుగా నేషనల్ హైవేలోకి ప్రవేశించి వరంగల్ వైపు వెళ్లవచ్చు. లారీలు, బస్సులు వంటి భారీ రవాణా వాహనాలకు ఉప్పల్ వైపు అనుమతి లేదు. వరంగల్ నుంచి వచ్చే భారీ వాహనాలను ఘట్కేసర్ లేదా ఓఆర్ఆర్ మీదుగా పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, ఎల్బీనగర్ వైపు మళ్లిస్తారు. అలాగే సిటీ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలను కూడా ఎల్బీనగర్, హయత్ నగర్ ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ చేరుకుని అక్కడినుంచి వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంది. అంతేకాదు.. ఉప్పల్ సరీల్లో వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల స్టాప్లను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట సమీపానికి మార్చారు. ఉప్పల్ భగాయత్ అంతర్గత రహదారులు ఇరుకుగా ఉన్నందున ప్రయాణికులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..