బెంగాల్లో రగడ.. గోవులకు బర్త్ సర్టిఫికెట్ అడిగిన బీజేపీ ఎమ్మెల్యే
బెంగాల్లో రగడ.. గోవులకు బర్త్ సర్టిఫికెట్ అడిగిన బీజేపీ ఎమ్మెల్యే
బెంగాల్


కలకత్తా, 18 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర, పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని అడ్డగించి, వాటికి 'బర్త్ సర్టిఫికెట్లు' చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆమె డిమాండ్పై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

అసలేం జరిగిందంటే..!

హింగల్గంజ్ నియోజకవర్గంలోని లేబుఖాలీ ప్రాంతంలో పశువుల లోడుతో వెళుతున్న వాహనాన్ని ఎమ్మెల్యే రేఖా పాత్ర ఆపారు. అనంతరం వాహనంలోని పశువులను కిందకు దించి, రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు కట్టేశారు. వాటికి గడ్డి, నీళ్లు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రేఖా పాత్ర మాట్లాడుతూ.. అక్రమ పశువుల వ్యాపారులపై ముఖ్యమంత్రి సుబేందు అధికారి కఠిన చర్యలకు ఆదేశించారని తెలిపారు. 14 ఏళ్లలోపు వయసున్న పశువులను వధించరాదని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని ఆమె పేర్కొన్నారు. మా ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 ఏళ్ల లోపు ఆవుల వధపై కఠిన నిషేధం ఉంటుంది. ఎవరైనా అక్రమంగా ఆవులను రవాణా చేస్తూ పట్టుబడితే, వారిని ఆపి ఆవుల బర్త్ సర్టిఫికెట్లు చూపించమని అడుగుతాం. చూపించడంలో విఫలమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఆమె స్పష్టం చేశారు.

రేఖా పాత్ర వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత (డబుల్ ఇంజిన్) రాష్ట్రాల్లో ఆవులకు జారీ చేసిన ఒక్క బర్త్ సర్టిఫికెట్ను అయినా గౌరవ శాసనసభ్యురాలు చూపించాలని కోరారు. బీజేపీ అలాంటి సర్టిఫికెట్ను చూపించగలిగితే, ఆ ధ్రువీకరణ పత్రాలను ఎవరు జారీ చేశారో కూడా మేం తనిఖీ చేయాల్సి ఉంటుంది అంటూ ఆయన సెటైర్ వేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత తీవ్రమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande