
మంత్రాలయం, 18 మే (హి.స.)
ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.
తెల్లవారుజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది.
గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం, పరిమళ ప్రసాద క్యూలైన్న్లు వద్ద భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీ పెరగడంతో లాడ్జీలకు, పూజా సామగ్రికి డిమాండ్ పెరిగింది. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తుల రద్దీని పరిశీలించి అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లను తనిఖీ చేశారు. స్వామిజీ పాద దర్శనం కోసం భక్తులు బార్లుతీరి స్వామిజీ ఆశీస్సులు పొందారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV