
న్యూఢిల్లీ, 19 మే (హి.స.)
దేశవ్యాప్తంగా ఉన్న టాటూ ప్రియులకు
సుప్రీంకోర్టు అలర్ట్ ప్రకటించింది. భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న టాటూ (పచ్చబొట్టు) పరిశ్రమపై ఎలాంటి చట్టపరమైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. దేశంలో ఏటా సుమారు 20,000 కోట్ల వ్యాపారంతో ఈ పరిశ్రమ నడుస్తున్నప్పటికీ, దీనిని పర్యవేక్షించేందుకు ఎలాంటి కేంద్రీకృత చట్టపరమైన వ్యవస్థ లేదని పిటిషనర్ సుశీల్ బాత్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ట్యాటూ పార్లర్లలో ఒకరికి వాడిన సూదులనే మళ్లీ ఇతరులకు వాడటం వంటి అపరిశుభ్ర పద్ధతుల వల్ల రక్తం ద్వారా వ్యాపించే హెచ్ఐవి/ఎయిడ్స్ (HIV), హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ప్రాణాంతక వ్యాధులు ఒకరి నుండి ఒకరికి సంక్రమించే ప్రమాదం ఉందని పిటిషన్ తీవ్రంగా హెచ్చరించింది.
అలాగే టాటూల కోసం ఉపయోగించే రంగు సిరాలలో (Tattoo Inks) సీసం (Lead), అల్యూమినియం వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు ఉంటున్నాయని.. ఇవి శరీరంలోకి చేరి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు, క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. వీటితో పాటు మైనర్లకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా టాటూలు వేయడాన్ని కూడా నియంత్రించాలని, ఆర్మీ వంటి రక్షణ రంగ ఉద్యోగాల నిబంధనల గురించి తెలియక టాటూల వేయించుకుని యువత నష్టపోతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా ట్యాటూ పరికరాలకు ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించాలని, అన్ని ట్యాటూ పార్లర్లకు కఠినమైన రిజిస్ట్రేషన్, తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..