
న్యూఢిల్లీ, 19 మే (హి.స.)
దేశంలో వీధికుక్కల దాడులు,
కుక్కకాట్ల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి నివారణపై సుప్రీంకోర్టు మంగళవారం అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కుక్కలు, ఆకలితో ఉండే ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు అధికారుల్ని ఆదేశించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. వీధికుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గతేడాది నవంబర్ లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లలో కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు వంటి పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధికుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ (కుక్కల శస్త్రచికిత్స) పూర్తయిన తర్వాత, వాటిని 300 అదే ప్రదేశాలలో వదిలిపెట్టకూడదని గత నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. వీధికుక్కల్ని కేవలం జంతుసంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా దేశంలో పిల్లలు, వృద్ధులు, టూరిస్టులపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల దాడుల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు తప్పుబట్టింది. హార్ష్ గ్రౌండ్ రియాలిటీలను చూస్తూ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంపై జస్టిస్ సందీప్ మెహతా అసహనం వ్యక్తం చేశారు. వీధికుక్కల కారుణ్య మరణాలు, వాటిని జంతుసంరక్షణ కేంద్రాలకు తరలించడంపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం చెందితే, సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కార చర్యలతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..