
హైదరాబాద్, 19 మే (హి.స.)
హైదరాబాద్లోని ప్రముఖ షాపింగ్ కేంద్రమైన లులూ హైపర్మార్కెట్లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో పరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనలకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్టోర్లోని వివిధ విభాగాల నుంచి పాడైన దాదాపు 150 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో వెల్లడించారు.
తనిఖీల్లో భాగంగా అధికారులు హైపర్మార్కెట్లోని ఇన్-హౌస్ కిచెన్, రిటైల్ విభాగం, మాంసం విక్రయశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కిచెన్లో పరిశుభ్రత అత్యంత దారుణంగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన ఆహారాన్ని కనుగొని, వెంటనే దాన్ని పారవేయించారు. అంతేగాక ప్రాంగణంలో పురుగులు, కుళ్లిన కూరగాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడువు తీరడానికి దగ్గరలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్పై చిరిగిన, తప్పుదోవ పట్టించే లేబుల్స్ ఉన్నట్లు కనుగొన్నారు.
రిటైల్ విభాగంలోనూ పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. శనగపిండి, గోధుమపిండి, పప్పులు వంటివాటిలో పురుగులు పట్టి ఉండటాన్ని అధికారులు గమనించారు. కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్పై గడువు ముగిసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను గుర్తించారు. అనేక ఉత్పత్తులపై పోషక విలువల సమాచారం, తయారీదారుడి చిరునామా, సరైన ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ వంటి తప్పనిసరి వివరాలు లేకపోవడం గమనార్హం.
మాంసం విక్రయించే బుచరింగ్ విభాగంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మాంసం వ్యర్థాలతో డ్రైనేజీలు మూసుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ తనిఖీ అనంతరం పురుగులు పట్టిన స్వీట్లు, వంట నూనెలు, పిండి, పప్పులతో సహా సుమారు 150 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ, కృత్రిమ రంగుల వాడకం, పురుగుల కాలుష్యం వంటి అనుమానాలతో పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, తదుపరి విశ్లేషణ కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi