రుతుపవనాలు ముందే రాక.. కానీ వేడి, ఉక్కపోత తప్పదు: ఐఎండీ
రుతుపవనాలు ముందే రాక.. కానీ వేడి, ఉక్కపోత తప్పదు: ఐఎండీ
rain


న్యూఢిల్లీ, 02 మే (హి.స.)వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒకేసారి చల్లని, వేడి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని శుభవార్త చెప్పింది. అదే సమయంలో, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు తప్పవని హెచ్చరించింది.

ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్, నికోబార్ దీవులను తాకే అవకాశం ఉంది. మే నెలలో దేశ సగటు వర్షపాతం సాధారణం కంటే 110 శాతం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. అయితే తూర్పు, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి.

వర్షాల సూచన ఉన్నప్పటికీ, వేడి విషయంలో ఊరట అంతంతమాత్రంగానే ఉండనుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నా, రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం అధికంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. అధిక వర్షాల అంచనాతో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. దీనివల్ల రాత్రిపూట వేడి బయటకు పోకుండా చిక్కుకుపోయి రాత్రులు వెచ్చగా ఉంటాయి అని మహాపాత్ర వివరించారు.

మరోవైపు గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తూర్పు తీర రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అధిక తేమ కారణంగా ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. కేరళకు రుతుపవనాల రాక తేదీని మే చివరి వారంలో ప్రకటిస్తామని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande