
అమరావతి, 20 మే (హి.స.)
లేపాక్షి షోరూమ్లు, హస్తకళా రూపాల విక్రయాలపై మంత్రి సవిత ఈరోజు(బుధవారం) సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూమ్లకు నూతన హంగులు ఇవ్వాలని మంత్రి సవిత సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూమ్లను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో రాజమండ్రి ఎయిర్పోర్టులో నూతన లేపాక్షి షోరూమ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హస్తకళా రూపాల అమ్మకాలను పెంచడానికి ఈ-కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నేరుగా వినియోగదారుల ఇళ్లకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పించాలన్నారు. హస్తకళాకారులకు సంవత్సరంలో 365 రోజుల పాటు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈ సమావేశంలో లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ