
హైదరాబాద్, 16 జూన్ (హి.స.)
:లోక్సభలో విపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై డీఎంకే మండిపడింది. రాహుల్ను ఒక పెద్ద జోక్ అంటూ వెక్కిరించింది. కాంగ్రెస్ రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్నప్పుడు తాము ఆ పార్టీని భుజాలపై మోశామని పేర్కొంది. కానీ ఒక కొత్త మెరిసే బొమ్మను (విజయ్ను ఉద్దేశించి) చూడగానే కాంగ్రెస్ పడవ నుంచి దూకేసిందని మండిపడింది. ఈ మేరకు డీఎంకే ఐటీ విభాగం హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
మరోవైపు, ప్రతిపక్షాల ఐక్యతను రాహుల్ బలహీనపరుస్తున్నారని డీఎంకే పత్రిక మురసోలి ఆరోపించింది. ఇండియా బ్లాక్ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ప్రతిపక్ష పార్టీల మధ్య చీలికలకు కాంగ్రెస్ నాయకుడే స్వయంగా కారణమయ్యారని విమర్శించింది. అయితే ఇండియా కూటమిలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు తాము మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ప్రతిపక్షాల ఐక్యత గురించి బోధిస్తూనే, దానిని బలహీనపరుస్తున్నారని మండిపడింది. ఈ మేరకు డీఎంకే పత్రిక మురసోలిలో సోమవారం ప్రచురితమైన సంపాదకీయంలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi