
హైదరాబాద్, 28 జూన్ (హి.స.)భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు ఘన నివాళులర్పించారు. భారతదేశ పురోగతికి, దేశ నిర్మాణానికి నరసింహారావు అందించిన విశేష సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని ఆయన కొనియాడారు. పివి నరసింహారావు ఒక అద్భుతమైన పండితుడు, రాజనీతిజ్ఞుడని, ఆయన హయాంలో దేశంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని ఖర్గే సామాజిక మాధ్యమాల ద్వారా స్మరించుకున్నారు.
1991 నుంచి 1996 వరకు భారతదేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు, దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో అగ్రగామిగా నిలిచారని ఖర్గే పేర్కొన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్తో కలిసి ఆయన దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చివేసాయన్నారు. దేశీయ పరిశ్రమలకు ఊతమివ్వడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆ సంస్కరణలు మైలురాయిగా నిలిచాయని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వంలో రక్షణ, విదేశీ వ్యవహారాలు, హోం మంత్రిత్వ శాఖల వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన పివి, బహుభాషా కోవిదుడిగా దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటారని ఖర్గే గుర్తుచేశారు. దేశ విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడంలో ఆయన పోషించిన పాత్రను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా స్మరించుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi