
చెన్నై: , 29 జూన్ (హి.స.)మిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడిఎంకే (AIADMK) మాజీ మంత్రి బెంజమిన్ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన 5,000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు అధికారికంగా ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీలో చేరారు. చెన్నై వానగరంలోని శ్రీ వారు కల్యాణ మండపంలో జరిగిన భారీ సభ్యత్వ చేరికల కార్యక్రమంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బెంజమిన్ రాక డీఎంకేకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆయన అసెంబ్లీలో ఎప్పుడూ గణాంకాలు, నిజాలతో మాట్లాడే వ్యక్తి అని స్టాలిన్ కొనియాడారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎం.కె. స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, శ్రేణులంతా పోలింగ్కు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు మూడు నెలల్లో రావచ్చు లేదా ఆరు నెలల తర్వాత రావచ్చు, ఎప్పుడు వచ్చినా మనం 100 శాతం సిద్ధంగా ఉండాలి అని ఆయన స్పష్టం చేశారు. తమ గత ఐదేళ్ల డీఎంకే పాలనలో తమిళనాడు దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ముఖ్యమంత్రి ఉదయం అల్పాహార పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని గుర్తుచేశారు.ఇదే సమయంలో ప్రస్తుత టీవీకే (TVK) నేతృత్వంలోని ప్రభుత్వంపై స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత నెల రోజులుగా రాష్ట్రం అభివృద్ధి పథం నుంచి పక్కకు జరిగిందని, పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఆరోపించారు. మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల విక్రయాలు, పెట్రోల్ బాంబు దాడులు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కార్యక్రమం ముగింపులో మాజీ మంత్రి బెంజమిన్.. స్టాలిన్ను శెంబగపూ (చంపక పుష్పాల) మాల మరియు వెండి కత్తితో ఘనంగా సత్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi