దేశంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోని తొలి ఏఐ యూనివర్సిటీ: డీకే శివకుమార్
దేశంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోని తొలి ఏఐ యూనివర్సిటీ: డీకే శివకుమార్
DK Shivakumar


బెంగళూరు, 15 జూలై (హి.స.)

దేశంలో ఏఐ \విద్య, టెక్నాలజీ, ఆవిష్కరణలకు సంబంధించి కర్ణాటకను ఒక ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు 6వ తరగతి నుంచే ఏఐ విద్యను ప్రవేశపెట్టాలని, అలాగే బెంగళూరులో భారతదేశపు మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బుధవారం ఎక్స్‌లో తెలిపారు.

విద్య, పరిశోధన, డిజిటల్‌ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రం ‘ఏఐ-స్థానిక కర్ణాటక’ను నిర్మించే దిశగా కృషి చేస్తుందని అన్నారు. ప్రతిపాదిత ఏఐ యూనివర్సిటీని బెంగళూరులో స్థాపిస్తామని, ఏఐ, వర్ధమాన సాంకేతికత (Emerging technology)ల్లో నైపుణ్యం కలిగిన నిపుణులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తుందని తెలిపారు. విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశ్రమల మధ్య పరిశోధన, ఆవిష్కరణ, సహకారానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక ఏఐ హబ్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుందని వెల్లడించారు.

ఈ ప్రణాళికలోని ముఖ్యమైన అంశాల్లో మొదటిది 6వ తరగతి (6th Class) నుంచే విద్యార్థులకు ఏఐ విద్యను పరిచయం చేయడం అని శివకుమార్‌ అన్నారు. ఏఐపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడం, టెక్నాలజీ రంగంలో కెరీర్‌ కోసం వారిని సిద్ధం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

విద్యారంగంతో పాటు రెండు హైపర్‌స్కేల్‌ గ్రీన్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. దీనివల్ల సుస్థిరతపై దృష్టి సారిస్తూ ఏఐ రీసెర్చ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, లార్జ్‌ స్కేల్‌ డేటా ప్రాసెసింగ్‌కు అవసరమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలు లభిస్తాయని భావిస్తున్నామని ప్రకటించారు. పాఠశాలలకు సంబంధించిన ఏఐ పాఠ్యప్రణాళిక, యూనివర్సిటీ ప్రవేశ ప్రక్రియ, వీటి అమలుకు సంబంధించిన కాలక్రమం ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande