
హైదరాబాద్, 17 జూలై (హి.స.)
తీవ్రమైన ఆరోపణలతో వరుసగా 30 రోజులు జైలులో ఉన్న ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలను పదవి నుంచి తొలగించే బిల్లుపై నివేదిక ఆమోదాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ వాయిదా వేసింది. ఈ అంశంపై మరింత చర్చ అవసరమని కమిటీ సభ్యులు భావించినట్లు జేపీసీ ఛైర్పర్సన్ అపరాజితా సారంగి తెలిపారు. 130వ సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ ఇటీవల సభ్యులకు పంపిణీ చేసిన తన ముసాయిదా నివేదికలో ఐదు సిఫారసులు చేసింది. శుక్రవారం ఒక్కో సిఫారసుపై కమిటీ విడివిడిగా ఓటింగ్ నిర్వహిస్తున్న సమయంలో మరిన్ని సంప్రదింపులు, సభ్యుల మధ్య చర్చ అవసరమని నిర్ణయించారు. ముసాయిదా ఆమోదాన్ని వాయిదా వేయాలని నిర్ణయించడంతో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తాము సమర్పించిన అసమ్మతి లేఖలను వెనక్కి తీసుకున్నారు. సంబంధిత వర్గాలతో మరిన్ని సంప్రదింపులు అవసరమని సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏకగ్రీవంగా అభిప్రాయపడిందని సారంగి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi