
న్యూఢిల్లీ, జూలై 15 (హి.స.) : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ దేశంలోని మహిళా శక్తితో మాతృత్వ విమర్శ అనే అంశంపై సుదీర్ఘంగా మాట్లాడనున్నారు. జూలై 24న అంతర్జాతీయ అంబేద్కర్ సెంటర్లో విశ్వమాంగల్య సభ నిర్వహించబోయే ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 700 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో విశ్వమాంగల్య సభ జాతీయ సంఘటనా కార్యదర్శి డాక్టర్ వృషాళి జోషి మాట్లాడుతూ... రాబోయే సంవత్సరాల కోసం కాలానికి అనుగుణంగా ఉండే మాతృత్వం అనే అంశంపై సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ మహిళలతో ఇంత పెద్ద ఎత్తున చర్చలు జరపబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం సుమారు రెండు నుండి రెండున్నర గంటల పాటు సాగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ భాగవత్ మాతృత్వం, కుటుంబం, సమాజ నిర్మాణం, దేశ పురోగతిలో మహిళల పాత్ర వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ కార్యక్రమంలో ప్రొశ్నోత్తరాల సమయం కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. దీని ద్వారా అక్కడకు వచ్చే మహిళలు నేరుగా సర్సంఘచాలక్ను ప్రశ్నలు అడిగేందుకు, తమ ఆలోచనలను పంచుకోవడానికి వీలవుతుంది.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సంవత్సరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని ఆమె అన్నారు. సంఘ్ చరిత్రలో ఇప్పటివరకు ఉన్న ఐదుగురు సర్సంఘచాలక్ల కాలంలో... ఒక సర్సంఘచాలక్ దేశంలోని విద్యావంతులైన మహిళలతో మాతృత్వ విమర్శ లాంటి అంశంపై బహిరంగంగా, ఇంత సుదీర్ఘంగా మాట్లాడనుండడం ఇదే మొదటిసారి.
దిల్లీలోని అంబేద్కర్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో దిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల నుండి సుమారు 700 నుండి 800 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని ఆమె తెలిపారు. వీరిలో విద్య, సామాజిక సేవ, సంస్కృతి, సాహిత్యం, వైద్యం, న్యాయం, పరిపాలన, పరిశ్రమలు వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు పాల్గొంటారు.
ఇదే క్రమంలో హైదరాబాద్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించనున్నారని, అందులో దాదాపు 1,300 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. సమాజంలో మాతృత్వం పాత్ర, కుటుంబ వ్యవస్థ, సంస్కారాల పెంపొందింపు, దేశ నిర్మాణంలో మహిళల సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం.
సమాజంలోని విభిన్న వర్గాల మహిళలతో అర్థవంతమైన చర్చలు జరపడానికి ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలుస్తుందని, మాతృత్వానికి సంబంధించిన సామాజిక, సాంస్కృతిక, జాతీయ కోణాలపై విస్తృతమైన చర్చను ముందుకు తీసుకెళ్తుందని డాక్టర్ వృషాళి జోషి అన్నారు.
ప్రస్తుతం ఈ సంస్థ పని దేశంలోని 33 ప్రాంతాల్లో సాగుతోందని ఆమె తెలిపారు. 3,500 మంది బాధ్యతాయుత కార్యకర్తలు, 6 లక్షల మంది మహిళలు ఈ సంస్థతో ముడిపడి ఉన్నారు. ఇటీవల దిల్లీతో పాటు 23 ప్రాంతాలలో మహిళా సదస్సులు నిర్వహించగా, అందులో దాదాపు 35 వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఈ చర్చల ఆధారంగా, రాబోయే సంవత్సరాల్లో కాలానికి తగిన మాతృత్వం అనే అంశంపై రకరకాల కార్యక్రమాల ద్వారా పనిచేయాలని సంస్థ నిర్ణయించింది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi