అనుమతి రాకపోయినా ఢిల్లీ వెళ్తాం.. రాష్ట్ర హోదా నిరసన ప్రణాళికలో మార్పు లేదు: సీఎం ఒమర్ అబ్దుల్లా
అనుమతి రాకపోయినా ఢిల్లీ వెళ్తాం.. రాష్ట్ర హోదా నిరసన ప్రణాళికలో మార్పు లేదు: సీఎం ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah


హైదరాబాద్, 15 జూలై (హి.స.)

మంగళవారం రాత్రి తన బాబాయ్, సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నాయకుడు డాక్టర్ ముస్తఫా కమల్ మరణించినప్పటికీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తమ ఢిల్లీ నిరసన ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు సంపూర్ణ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజైన జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించింది.

ఈ నిరసన కార్యక్రమానికి ఢిల్లీ యంత్రాంగం నుంచి ఇప్పటివరకు అధికారిక అనుమతి లభించలేదు. దీనిపై ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అనుమతి కోసం తాము ఓపికగా ఎదురుచూస్తున్నామని, అయితే అనుమతి వచ్చినా రాకపోయినా తాము అనుకున్నట్లుగానే జూలై 19న ఢిల్లీకి చేరుకుంటామని తేల్చి చెప్పారు. ఒకవేళ జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి నిరాకరిస్తే, ఢిల్లీకి చేరుకున్న తర్వాత పార్టీ నాయకులమంతా కలిసి కూర్చొని తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పి రెండేళ్లుగా కాలయాపన చేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఒమర్ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొనాల్సిందిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ సహా దేశంలోని 52 మంది ప్రముఖ విపక్ష నాయకులకు ఎన్‌సి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే లేఖలు పంపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande