
న్యూఢిల్లీ 16 జూలై (హి.స.)
:ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తన ప్రతిష్టాత్మక 'ఐ-డ్రోన్' (i-DRONE) కార్యక్రమం కింద చేపట్టిన ఒక తాజా అధ్యయనంలో డ్రోన్ల ద్వారా క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ పరీక్షల సమయం మరియు రోగుల ఖర్చులు భారీగా తగ్గినట్లు వెల్లడైంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ (AIIMS) బీబానగర్ మరియు జిల్లా క్షయ నివారణ కార్యాలయం సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగాత్మక అధ్యయనాన్ని నిర్వహించారు.ఈ పరిశోధనలో భాగంగా సుదూర గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) నుండి టీబీ రోగుల ఉమ్మి (Sputum) నమూనాలను డ్రోన్ల ద్వారా జిల్లా నిర్ధారణ ల్యాబ్లకు వేగంగా చేరవేశారు. మొత్తం 840 మంది బాధితులపై ఏడాది పాటు జరిపిన ఈ అధ్యయనం ద్వారా గతంలో టీబీ రోగ నిర్ధారణకు పట్టే సగటు సమయం (Turnaround Time) 15 రోజుల నుండి కేవలం 5 రోజులకు తగ్గిందని తేలింది. అలాగే రోగులు పరీక్షల కోసం స్వయంగా ప్రయాణించడం తగ్గడం వల్ల వారి సగటు జేబు ఖర్చు ₹9,451 నుండి ఏకంగా ₹91కి పడిపోయిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ సాంకేతికత గ్రామీణ మరియు కొండ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను మరింత సులభతరం చేయడమే కాకుండా, త్వరితగతిన చికిత్స ప్రారంభించడానికి ఎంతో దోహదపడుతుందని ఐసీఎంఆర్ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi