
అమరావతి, 18 జూలై (హి.స.)
స్వాతంత్య్ర దిన వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆయా శాఖలను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర-2047 నినాదంతో (థీమ్)తో వేడుకల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతంలోని ప్రస్తుత పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖలు శకటాల ప్రదర్శనకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా ఏర్పాట్లపై జీఏడీ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ