భారత్ కచ్చితంగా ఫిఫా వరల్డ్ కప్లో ఆడుతుంది.. ఆ జట్టులో తెలంగాణ స్టార్లు ఉంటారు: సీఎం రేవంత్
భారత్ కచ్చితంగా ఫిఫా వరల్డ్ కప్లో ఆడుతుంది.. ఆ జట్టులో తెలంగాణ స్టార్లు ఉంటారు: సీఎం రేవంత్
Telangana CM Revanth Reddy


హైదరాబాద్, 19 జూలై (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ఫుట్‌బాల్ భవిష్యత్తుపై తనకున్న దార్శనికతను పంచుకున్నారు. భవిష్యత్తులో టీమిండియా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడటమే కాకుండా, ఆ టోర్నీకి ఆతిథ్యం కూడా ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను ఫుట్‌బాల్‌ను ఎంతగానో ఇష్టపడతానని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో తెలంగాణ నుంచి పలువురు స్టార్లు ఉంటారని జోస్యం చెప్పారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి.. భవిష్యత్ సాకర్ స్టార్లు చాలామంది తెలంగాణ నుంచే వస్తారు అని ఆయన అన్నారు. ఫిఫా వరల్డ్ కప్‌కు తన మద్దతు వెనుక లోతైన ఉద్దేశం, దార్శనికత ఉన్నాయని వివరించారు.

గతంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, తెలంగాణ పిల్లలతో కలిసి మైదానంలో పాలుపంచుకునేలా చేసిన రోజును తాను ఎంతో ఇష్టపడతానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చివరగా, ఫుట్‌బాల్ అభిమానులందరూ ఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదించాలని ఆయన ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande