సిబ్బంది ‘సర్’కి.. పారిశుధ్యం గాలికి
హైదరాబాద్ నగరంలోని ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధుల్లోని పలు ప్రాంతాల్లో పది రోజులుగా పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదు.
Garbage


హైదరాబాద్, 18 జూలై (హి.స.)హైదరాబాద్ నగరంలోని ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధుల్లోని పలు ప్రాంతాల్లో పది రోజులుగా పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. ముఖ్యంగా కాలనీలు, బస్తీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. రహదారులను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో పాల్గొనడమే ఇందుకు కారణం. సర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు పారిశుధ్య కార్మికుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. చాలా సర్కిళ్లల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ బాధ్యతను పారిశుధ్య కార్మికులకు అప్పగించారు.

విద్యావంతులైన పారిశుధ్య కార్మికులు, ఎస్ఎఫ్ఏలు కొన్నిచోట్ల బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)లుగానూ కొనసాగుతున్నారు. ఇది పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిజానికి, ట్రై కార్పొరేషన్ల పరిధిలో అవసరానికి సరిపడా పారిశుధ్య కార్మికులు లేరు. కాగితాల్లో ఉన్న స్థాయిలోనూ క్షేత్రస్థాయిలో శానిటేషన్ వర్కర్లు కనిపించరు. బయోమెట్రిక్, ముఖ ఆధారిత హాజరు వంటి అధునాతన సాంకేతికత వినియోగిస్తున్నా.. ఇప్పటికీ కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు హాజరవ్వడం లేదు.

కొందరు పూర్తిగా గైర్హాజరవుతుండగా.. ఇంకొందరు హాజరు వేసుకొని ఇంటికి వెళ్తున్నారు. సిబ్బంది కొరత వల్ల ప్రధాన రహదారులు మినహా, కాలనీలు, బస్తీల్లోని అంతర్గత రోడ్లలో రోజూ స్వీపింగ్ జరగడం లేదు. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులకు ప్రస్తుతం సర్ విధులు అప్పగించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారం రోజులుగా రహదారుల ఊడవకపోవడంపై ప్రజలు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ స్పందన లేదు. మొత్తంగా సర్ ట్రై కార్పొరేషన్లలోని శానిటేషన్పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande