
జగిత్యాల, 18 జూలై (హి.స.) జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ బావులు, బోర్లకు సక్రమంగా విద్యుత్ అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం కంటే వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమకు అత్యంత అవసరమన్నారు. మాకు కోట్లు వద్దు.. లక్షలు వద్దు.. కేవలం కరెంట్ ఇవ్వండి.
మేము కష్టపడి వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడతాం అని ఓ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దేశానికి వెన్నెముక అని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని రైతులు పేర్కొన్నారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. త్రీఫేస్ కరెంట్ 10 గంటలే ఇస్తే పంటలు ఎండిపోతున్నాయని, పాత పద్ధతిలో 17 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని విద్యుత్ శాఖ ఏడిఈకి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..