
భద్రాచలం, 18 జూలై (హి.స.)
తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో విషాద
సంఘటన చోటు చేసుకుంది. చేపలు వేటకు వెళ్లిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు గోదావరిలో గల్లంతు అయ్యారు. కాగా వీరందరూ మరణించినట్టు అధికారులు చెప్పారు. విలీన ఎటపాక మండలం గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీ భారతి, సుశీల, మరో మహిళతో పాటు బాలరాజు, రమేష్ ఐదుగురు కలిసి గొల్లగూడెం వద్ద గోదావరిలో శనివారం ఉదయం చేపలు పట్టడానికి వెళ్లి లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. సమీపంలోని వారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన రమేష్ ఊకె (38), భారతి తుర్రం (40), లక్ష్మి ఉయిక (37), ఉయిక సుశీల (37), బాలరాజు బసిపోయిన (40)గా గుర్తించారు. ఐదుగురు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..