
రేణిగుంట , 19 జూలై (హి.స.)యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడి గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసులు డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకపురం గ్రామ సమీపంలో ప్రత్యేక తనిఖీలు,అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గాజులమాండ్యం సీఐ ఎం.మంజునాథ రెడ్డి, ఎస్ఐ ఎస్.హరీష తో పాటు పోలీసు సిబ్బంది ఆధునిక బయోచెక్ కిట్ల ద్వారా గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు.
డీఎస్పీ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి కేవలం మాదకద్రవ్యం మాత్రమే కాదని,యువత భవిష్యత్తు, కుటుంబాల ఆనందం,సమాజ అభివృద్ధిని దెబ్బతీసే సామాజిక సమస్య అని అన్నారు.గంజాయి వినియోగదారులను శాస్త్రీయంగా గుర్తించి,వారి ద్వారా సరఫరా వ్యవస్థలోని ప్రధాన నిర్వాహకులు, మధ్యవర్తులు, విక్రేతలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి కేసుల్లో గతంలో నమోదైన నిందితులు,విక్రేతలు, వినియోగదారులపై నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు. పోలీసుల లక్ష్యం కేవలం నేరస్తులను అరెస్టు చేయడం మాత్రమే కాదని,వ్యసనానికి బానిసైన యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
గంజాయి వ్యసనానికి గురైన యువతకు తల్లిదండ్రుల సమ్మతితో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, పాపానాయుడుపేటలోని RASS పునరావాస కేంద్రం, స్విమ్స్,రుయా ఆసుపత్రుల్లోని డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స, పునరావాస సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
గంజాయి వల్ల విద్య, ఉపాధి, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడంతో పాటు యువత నేరాల వైపు మళ్లే ప్రమాదం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసిన డీఎస్పీ, ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని,సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట రూరల్ సీఐ ఎం.మంజునాథ రెడ్డి,గాజులమాండ్యం ఎస్ఐ ఎస్.హరీష,ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV