
పుల్గావ్, 20 జూలై (హి.స.)
: మహారాష్ట్రలోని వార్ధా జిల్లా పరిధిలో గల సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విరుల్ ఇంటర్చేంజ్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక సరుకు రవాణా ట్రక్కు కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. డీకొట్టిన ట్రక్కు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మరణించగా, ట్రక్కు క్లీనర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ప్రమాదానికి కొన్ని గంటల ముందే అదే ప్రాంతంలో ఇథనాల్తో వెళ్తున్న ఒక పెద్ద ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది. అత్యంత సులభంగా మంటలు అంటుకునే ప్రమాదం ఉన్న ఇథనాల్ కెమికల్ కావడంతో, రహదారికి ఒకవైపున ఉన్న ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేశారు. దీనివల్ల హైవేపై కేవలం ఒకే ఒక లైన్ ద్వారా వాహనాల రాకపోకలను అనుమతించారు. ఈ క్రమంలో నాగ్పూర్ వైపు వెళ్తున్న సరుకు రవాణా ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, ఇంటర్చేంజ్ నంబర్ 80 వద్ద పుల్గావ్ సమీపంలో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. ట్రక్కు బలంగా గుద్దడంతో కారులో క్షణాల్లో మంటలు వ్యాపించాయని, లోపల ఉన్న ప్రయాణికులకు బయటకు తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో వాహనం లోపలే కాలి బూడిదయ్యారని పోలీసులు తెలిపారు.ప్రాథమిక సమాచారం ప్రకారం కారులో మరణించిన నలుగురు ప్రయాణికులు వార్ధా జిల్లాకు చెందిన నివాసితులుగా పోలీసులు గుర్తించారు. మృతుల మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం పుల్గావ్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే హైవే పోలీసులు, పుల్గావ్ స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బోల్తా పడిన ట్యాంకర్లోని ఇథనాల్ను ముందుగా సురక్షితంగా వేరే వాహనంలోకి ఖాళీ చేసిన తర్వాతే ఆ కంటైనర్ను తొలగించాల్సి ఉండటంతో సహాయక చర్యలు సవాలుగా మారాయని అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi