
హైదరాబాద్, 20 జూలై (హి.స.)
దేశంలో కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న విద్యావ్యవస్థ సంస్కరణల పోరాటం సరికొత్త మలుపు తిరిగింది. నీట్ పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీలపై గత 23 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన దీక్షను విరమించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మూడు కీలక షరతులను నెరవేరిస్తేనే సోమవారం నాడు తన ఫాస్టింగ్ ముగిస్తానని ఆయన స్పష్టం చేశారు. జులై 18న ఆయనను జంతర్ మంతర్ నిరసన స్థలం నుండి పోలీసులు బలవంతంగా ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
నన్ను అక్రమంగా బంధించారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్చుక్.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ ద్వారా తన మద్దతుదారులను ఉద్దేశించి రాసిన ఒక హ్యాండ్రిటన్ (చేతిరాత) లేఖను పంచుకున్నారు. మెడికల్ కేర్ పేరుతో ఆసుపత్రిలో తనను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. తన దీక్ష ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నిస్తున్న అభిమానుల కోసం ఆయన మూడు నిబంధనలను తెరపైకి తెచ్చారు.
వాంగ్చుక్ పెట్టిన 3 కండిషన్లు ఇవే
దేశంలో ఇటీవల జరిగిన విద్యావ్యవస్థ వైఫల్యాలు, పరీక్ష పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.
కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వంతో కలిసి తాను పార్లమెంట్ చేరినప్పుడు.. ఎంపీలు, వివిధ పార్టీల నేతలు ఈ విద్యా సంస్కరణల సమస్యను పార్లమెంట్లో కచ్చితంగా లేవనెత్తుతామని హామీ ఇవ్వాలి.
ఒకవేళ తన ఆరోగ్యం క్షీణించడం వల్ల లేదా ఇతర అనివార్య కారణాల వల్ల తాను స్వయంగా పార్లమెంట్కు వెళ్లలేకపోతే.. రాజకీయ పార్టీల నేతలు, ఎంపీలు ఆసుపత్రికే వచ్చి ఈ అంశాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని భరోసా ఇవ్వాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi