
న్యూఢిల్లీ , 04 జూలై (హి.స.)
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు వచ్చిన నిధులు మరియు విరాళాల దారిమళ్లింపు ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందంతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ డిమాండ్ చేశారు. ఈ ట్రస్ట్లో భారతీయ జనతా పార్టీ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుల ఆధిపత్యం ఎక్కువగా ఉందని ఆరోపించిన ఆమె కేవలం ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని ఈ నిధుల దొంగతనం వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి సమాధానం చెప్పాలని కోరారు. ఈ కేసులో జవాబుదారీతనం లేకుండా ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారని విమర్శిస్తూ ఎస్ఐటి నివేదికను బహిరంగపరచాలని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఈ నిధుల దుర్వినియోగం కేసులో నిజంగానే డబ్బు దారిమళ్లిందని దీనిపై తాను ప్రధానమంత్రితో మాట్లాడానని బీజేపీ నేత వినయ్ కతియార్ వెల్లడించారు. ఈ అక్రమాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, అడ్మినిస్ట్రేటర్ గోపాల్ రావు మరియు మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ఆలయ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక విచారణ బృందం గడువును ప్రభుత్వం మరో పదిహేను రోజులు పొడిగించగా దర్యాప్తు సంస్థ ఆలయ ప్రాంగణంలో సమగ్ర విచారణను ముమ్మరం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi