
అమరావతి, 21 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేంద్రం నుండి రావాల్సిన భారీ నిధులను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) కింద 2026-27 నుండి 2030-31 కాలానికి గాను ఆంధ్రప్రదేశ్కు రూ. 28,785 కోట్ల నిధులు కేటాయించబడ్డాయి. ఇందులో రూ. 16,627 కోట్లు గ్రామీణ సంస్థలకు, రూ. 12,158 కోట్లు పట్టణ సంస్థలకు చెందుతాయి. అయితే, ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు ఉంటేనే ఈ నిధులు పూర్తిగా విడుదలవుతాయి.
ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఓటర్ల జాబితా తయారీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి చట్టపరమైన ప్రక్రియలపై యంత్రాంగం వేగంగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు అత్యంత అవసరం. కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi