
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ రేపు బీజేపీ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
పార్టీ కార్యాలయం వద్ద రెండు రోజుల పాటు దీక్ష చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం 15వేల కోట్ల రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ తో దీక్షకు ఏర్పాట్లు చేశారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. అయితే పార్టీ కార్యాలయం ముందు దీక్ష చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు దీక్షను రిజెక్ట్ చేశారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా దీక్ష చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.
ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. పోలీసులు నిరాహార దీక్షకు నిరాకరించారని, అయినప్పటికీ తమ కార్యాలయం వద్ద దీక్ష చేసి తీరుతామన్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ దారుణమైన పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.ఫీజు రీయింబర్స్ మెంట్ అందక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థులు సైతం ఆందోళన చేస్తున్నారని చెప్పారు. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కూడా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు