
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) తెలంగాణలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ శుభవార్త అందించనుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంపై ఎంతటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గేది లేదని, అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్లు సక్రమంగా అందుతాయని ఆయన భరోసా ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2014 మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని, 2018లో అసలు దివ్యాంగుల అంశాన్నే పట్టించుకోలేదని విమర్శించారు. నిన్నటి సమావేశంలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని, కేవలం ముఖ్యమంత్రిని తిట్టడమే లక్ష్యంగా దివ్యాంగుల సమావేశాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. రూ. 50 కోట్ల నిధులతో మోపెడ్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులకు ప్రత్యేక కోటాను ఏర్పాటు చేశామని చెప్పారు. పుట్టిన వెంటనే శిశువులకు ఏదైనా అంగవైకల్యం గుర్తిస్తే, ‘బాల భరోసా’ పథకం కింద ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తోందని వివరించారు. భవిష్యత్తులో దివ్యాంగులకు మరిన్ని పారదర్శకమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్