తెలంగాణలో గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ
రాజమండ్రికే పరిమితమైన గోదావరి పుష్కరాల వైభవాన్ని తెలంగాణలోనూ ఘనంగా చాటేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బాసర నుంచి భద్రాచలం వరకూ పుష్కర ఏర్పాట్లను వేగవంతం చేస్తూ.. ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Surekha


హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.) తెలంగాణలో గోదావరి పుష్కరాలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోదావరి పుష్కరాలు అంటే ఇప్పటివరకు రాజమండ్రి మాత్రమే గుర్తొచ్చేదని, ఇకపై తెలంగాణలోనూ పుష్కరాలను గ్రాండ్గా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. ఈ ఏర్పాట్లలో భాగంగా పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ కార్యాలయాన్ని ప్రజాభవన్లో ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.

గోదావరి నది వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని కొండా సురేఖ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలను అభివృద్ధి చేసేలా పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పుష్కరాల పనులు ప్రారంభమయ్యాయని, మరికొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలను భక్తులకు గుర్తుండిపోయేలా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande