
హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.) నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం
వర్షిత్ ఇంటిపై నిన్న దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ కౌంటర్ అటాక్ కు సిద్ధమయింది. ఈ క్రమంలోనే అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు నేడు నల్గొండ వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు బయల్దేరగా ఆయన్ను తార్నాకలో హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఆయన నల్గొండ వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు అడ్డుకుని తమ వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా అని ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి దగ్గర్లో ఉందన్నారు.
1000 రోజుల పాలనలో ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుని ఇలా అరెస్టులు చేయడం తగదన్నారు. వర్షిత్ పై, అతని కుటుంబంపై కాంగ్రెస్ నేతలు దాడులు చేయడం తగదన్నారు. అటు నల్గొండలో, ఇటు హైదరాబాద్ లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..