
హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.) సెప్టెంబర్ 14 నుంచి జరిగే గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా సన్నాహక సమావేశం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితితో సమావేశం జరిగిందని.. ఉత్సవాలు ప్రశాంతంగా జరగడంపై చర్చించినట్లు చెప్పారు. సామూహిక ఉత్సవాలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గణేశ్ మండపాల నిర్వహణ, శానిటేషన్, భద్రత, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుపై చర్చించామన్నారు. భక్తులకు మొక్కల పంపిణీ చేయాలని, చేనేత కండువాలు వాడాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితిని కోరామన్నారు.
మట్టి వినాయకులను వాడి... పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పిలుపునిచ్చారు. బోనాల ఉత్సవాల సమయంలో మంచి వర్షాలు కురవాలని అన్ని ఆలయాల్లో పూజలు చేసినట్లు తెలిపారు. వినాయక మండపాల్లో ఎల్నినో కష్టాల నుంచి గట్టెక్కించి.. మంచి వర్షాలు కురవాలని పూజలు చేయాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి ప్రభుత్వం నుంచి సూచించామన్నారు. కోర్టులను గౌరవిస్తూనే ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రజలే స్వచ్ఛందంగా ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్