
నెల్లూరు, 01 సెప్టెంబర్ (హి.స.) వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపాల్టీలలో రూ.3300 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని వెల్లడించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని.. కోర్టుల్లో కేసులు వేశారని విమర్శించారు. వైసీపీ తరుఫున పోటీచేసే వారు లేరని.. అందుకే జగన్ ఎక్కడా ఏకగ్రీవం కాకూడదని నేతలకి హుకుం జారీచేశారని వ్యాఖ్యానించారు.
భోగాపురం ఎయిర్ పోర్టు, వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ తమదని వైసీపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం సరిచేసుకుని వెళుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నెల్లూరులో కాల్వల కట్టలపై నివాసం ఉండేవారికి, శాశ్వత పట్టాలు ఇచ్చే అంశంపై త్వరలోనే తీపికబురు చెబుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV