
హైదరాబాద్, 06 సెప్టెంబర్ (హి.స.) ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న పాత పౌల్ట్రీ ఫారమ్లో నిర్వహిస్తున్న భారీ కోడి పందేల స్థావరంపై పోలీసులు ఈరోజు (ఆదివారం) దాడి చేశారు. కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో శంషాబాద్ జోన్ ఇన్స్పెక్టర్ డి. కృష్ణమోహన్, ఎస్ఐలు కె. మన్సూర్ అలీ, ఎన్. నరసింగరావు, శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, ఆదిబట్ల పోలీసులు మూకుమ్మడిగా సోదాలు చేశారు. భోజన వసతి కల్పిస్తూ గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లకు ఇక్కడ కోడి పందేలు నిర్వహించడానికి నిర్వాహకులు ఆహ్వానం పలికినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో 22 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ పందెలు నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు, స్థల యజమాని పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘటన స్థలం నుంచి 31 పందెం కోళ్లు, 146 కత్తులు, 20 మొబైల్ ఫోన్లు, రూ. 3.60 లక్షల నగదును సీజ్ చేశారు. మొత్తం రూ.35 లక్షల విలువైన 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు నిర్వహిస్తున్న వారిని విచారణ నిమిత్తం ఆదిభట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్