అమరావతి18 అక్టోబర్ (హి.స.), : రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉండగా.. శాసనసభ, ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు తేదీలు ప్రతిపాదనకు వచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు శాసనసభ ఆమోదం తీసుకున్నారు. జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఎన్ని అప్పులున్నాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో.. పూర్తి వివరాలు రాబట్టి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వెలువరించి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరోసారి ఓటాన్ ఎకౌంట్కు ఆర్డినెన్సు రూపంలో ఆమోదం తీసుకున్నారు. ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్కు గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇలా మొత్తం 8 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ పద్దుతోనే గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నవంబరు రెండో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల