హైదరాబాద్:29 మార్చ్ (హిం.స) శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని భారాస) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఒక్కడుగా బయల్దేరి లక్షల మందితో సైన్యాన్ని తయారు చేశారని.. ఎన్నో అవమానాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించారని కొనియాడారు. అలాంటి వ్యక్తిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
‘‘ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించారు. రాష్ట్ర దశ, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్, భారాసను ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారుచేస్తాం.. పోరాట పంథాలో కదం తొక్కుదాం’’ అని ఆయన పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్