విజయవాడ: 29 మార్చ్ (హిం.స)ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీడీపీ (TDP) అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ (NTR) విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు వసంత పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, తెలుగుజాతి ఔన్నత్యం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని వసంత కృష్ణ ప్రసాద్ కొనియాడారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పునాదులు వేసిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం, పేదలకు పక్కా గృహాలు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన పేదల పక్షపాతిగా ఎన్టీఆర్ను కొనియాడారు. మైలవరం నియోజవర్గ ప్రజల అండదండలతో 2019లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టానన్నారు. తాను అదే స్ఫూర్తితో మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం 2024లో తిరిగి పోటీ చేస్తున్నానని, తనని గెలిపించాలని వసంత విజ్ఞప్తి చేశారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్