బెంగళూరు , 28 ఏప్రిల్ (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతోంది.
ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న రన్ మెషీన్ వరుస హాఫ్ సెంచరీలు బాదుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన అతడు ఏకంగా 6 అర్ధశతకాలు నమోదు చేయడం విశేషం. ఇక అతని బ్యాట్ నుంచి ధారాళంగా పరుగులు వస్తుండటం బెంగళూరు విజయాలకు దోహదపడుతున్నాయి.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో కోహ్లీ సరికొత్త చరిత్రను సృష్టించాడు. టోర్నీ చరిత్రలో 11 సీజన్లలో 400+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. నిజానికి, కోహ్లీకి ముందు ఏ ఆటగాడు కూడా తన కెరీర్లో 10 సార్లు కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు. అతని తర్వాతి స్థానంలో సురేశ్ రైనా, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ చెరో తొమ్మిదిసార్లు ఈ ఫీట్ను నమోదు చేశారు. ఆ తర్వాత రోహిత్ శర్మ (8), ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్ (6), గౌతమ్ గంభీర్, క్రిస్ గేల్, ఫాఫ్ డు ప్లెసిస్, శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తలో ఐదుసార్లు 400+ స్కోర్లు చేశారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా కోహ్లీనే. ప్రస్తుతం 8,500 పరుగుల మార్కుకు చేరువలో ఉన్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి