సోన్భద్ర, 11 మే (హి.స.): ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు సమాచారం పోస్ట్ చేసినందుకు ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్రలో ముగ్గురిని తమ నిర్బంధంలోకి తీసుకున్నారు. బాలగోపాల్ చౌరాసియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేస్బుక్లో అభ్యంతరకర కంటెంట్ పోస్టు చేసిన షబ్బీర్ అన్సారీ, జుబైర్ అన్సారీ, ఇజహర్లను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కలూ సింగ్ వెల్లడించారు.
ఈ అంశంపై దర్యాప్తు చేసిన ఏఎస్పీ.. ఆ పోస్టులు దేశ వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, నిందితులు శత్రుదేశాలతో సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులు పాకిస్థాన్ యూట్యూబర్ ఫేస్బుక్ కంటెంట్ను ఉపయోగించుకొని ప్రధాని మోదీని తప్పుగా చిత్రీకరించేలా ఎడిట్ చేసిన పోస్టులను పెట్టినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు