విజయవాడ, 19 మే (హి.స.)
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక
వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను అధికారులు రేపటికి (మంగళవారం) వాయిదా వేశారు. ఎన్నికకు కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20 మంది ఉన్నారు. వారిలో కేవలం ఏడుగురు మాత్రమే ఎన్నికకు వచ్చారు. మిగిలిన వారు ఎవరూ కూడా హాజరుకాకపోవడంతో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి చెప్పారు.
కాగా.. తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీకి చెందిన సభ్యులతో పాటు వారి అనుచరులు కూడా ఎన్నిక జరిగే ప్రాంగణానికి రావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలను, అనుచరులను ఎన్నికల ప్రాంగణం నుంచి చెదరగొట్టి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చారు పోలీసులు. ఎన్నిక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఉదయమే ఎన్నిక ప్రాంగణానికి చేరుకోవడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి చెదరగొట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల