గుంటూరు, 31 మే (హి.స.)
రెండు నెలల నుంచి కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి సర్వజనాసుపత్రిలో నూతన విధానంలో సర్జరీ చేసి కాలేయంలో ఉన్న నీటి బుడ్డను తొలగించి పూర్తి ఉపశమనం కలిగించారు. ఈ విధంగా సర్జరీ చేయడం ప్రభుత్వాసుపత్రుల్లో అరుదు. కుక్కలతో మెలగడం, కలుషిత నీరు తాగడం, ఉడకని మాంసం తినడం వల్ల కాలేయంలో నీటి బుడ్డ ఏర్పడతుంది. జనరల్ సర్జరీ రెండో యూనిట్ ఆచార్యులు యేకుల కిరణ్కుమార్, సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాలివే.. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రసాద్ (60) కామెర్ల సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి, చలిజ్వరంతో ఒంగోలు ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేదు. వైద్యుల సూచనతో ఏప్రిల్ 8న గుంటూరు జీజీహెచ్కు వచ్చారు. జనరల్ సర్జరీ రెండో విభాగం వైద్యులు పరీక్షించిన తర్వాత రోగికి కాలేయంలో నీటి బుడ్డ(హైడాటిడ్ సిస్ట్) ఉన్నట్లు గుర్తించారు. రోగికి రక్తహీనత, ఊపిరితిత్తుల్లో సమస్యలున్నందున ప్రత్యేక చికిత్స అందించారు. ఏప్రిల్ 18న మత్తు వైద్యుల సహకారంతో అధునాతన విధానంలో నాలుగున్నర గంటల పాటు సర్జరీ చేసి కాలేయంలో పెద్ద నీటి బుడ్డను తొలగించి మే 18న డిశ్ఛార్జి చేశారు. రూ.10 లక్షల ఖరైదీన ఈ చికిత్సను ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఉచితంగా చేశారు. ఈసందర్భంగా వైద్యుల బృందం కిరణ్కుమార్, నాగసంతోష్కుమార్, సాదిక్బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు తదితరులను సూపరింటెండెంట్ రమణ ప్రత్యేకంగా అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ