: జమ్మూ , 9 మే (హి.స.)
: జమ్మూకశ్మీర్లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకొంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకొన్నట్లు బీఎస్ఎఫ్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు పాక్కు చెందిన ధన్బార్లోని పోస్టును మన దళాలు ధ్వంసం చేశాయి.
మరోవైపు పాకిస్థాన్ నేడు కూడా నియంత్రణ రేఖకు ఆవలివైపు నుంచి భారీస్థాయిలో షెల్లింగ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉరి, జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. చాలామంది ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు.
పాక్తో సరిహద్దు పంచుకొంటున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాజస్థాన్లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది.
ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకొంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్పుర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పుర్, తార్న్ తరన్ స్కూళ్లను మూసివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల