శ్రీశైలం 1 జూన్ (హి.స.)జూరాల ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా చరిత్రలో మొదటి సారి జూరాల డామ్ మే నెలలో నిండింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే జూరాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గత రెండు రోజుల నుంచి జూరాల నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం శ్రీశైలానికి 30,797 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో నిల్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీరు నెమ్మదిగా పెరుగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం.. 829.80 అడుగులకు చేరింది. ఈ డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 49.3230 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అయితే ప్రతీ సంవత్సరం జూన్, జులై నెలలో వచ్చే వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద వచ్చి డ్యామ్ లు నిండుతాయి. కానీ ఈ సంవత్సరం అకాల వర్షాల కారణంగా ఇప్పటికే కృష్ణా, తుంగభద్ర నదుల పై ఉన్న చిన్న డామ్ లు నిండుకుండలా మారిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి