అహ్మదాబాద్, 13 జూన్ (హి.స.): అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బయపటడిన ప్రయాణికుడిని రమేశ్ విశ్వాస్ కుమార్గా గుర్తించారు. 11ఏ నంబర్ సీటులో అతడు ప్రయాణించినట్లు నగర పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని చెప్పారు. గుజరాత్లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్ నుంచి విశ్వాస్ రాగా.. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశ్వాస్ సోదరుడు కూడా ఆ విమానంలో ఉన్నప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం తెలియరాలేదు.
రమేశ్ విశ్వాస్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదం అనంతరం నడుచుకుంటూ వచ్చి అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో అతడి శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని ఓ వైద్యుడు మీడియాకు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ