హైదరాబాద్, 23 జూన్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి
అవినీతి ప్రాజెక్టే అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని లేఖ రాయాలన్నారు. కాళేశ్వరం అవినీతిపై బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకుల అవాకులు చవాకులు పేలుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా బీఆర్ఎస్ నాయకులు వాడుకున్నారని అన్నారు. దాని గురించి బండి సంజయ్ మాట్లాడారని చెప్పారు. అది వాస్తవమో కాదో బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టాలని అన్నారు. బండి సంజయ్ తప్పుగా మాట్లాడి ఉంటే బీఆర్ఎస్ నాయకులు సీబీఐ దర్యాప్తుకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లోనూ మీరు ఎంత అవినీతి చేశారో బండి సంజయ్ చెబుతారని అన్నారు. బండి సంజయ్ మాట్లాడింది వందశాతం నిజం అని, తప్పుగా మాట్లాడి ఉంటే బీఆర్ఎస్ నిరూపించుకోవాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్