కవిత లాంటి వారితో కూర్చుని విలువ తగ్గించుకోవద్దు.. ఆర్.కృష్ణయ్యకు మంత్రి పొన్నం కౌంటర్
హైదరాబాద్, 23 జూన్ (హి.స.) బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం సరికాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు
మంత్రి పొన్నం


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)

బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం సరికాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు బీసీలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, మా ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో అమోదింపచేసుకొని గవర్నర్ కు పంపినట్లు ఆయన గుర్తు చేశారు. బడుగుల పట్ల రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు.

బలహీన వర్గాల కోసం విద్యార్థి ఉద్యమాలు చేపట్టిన పెద్దన్న, ఎంపీ ఆర్. కృష్ణయ్య అంటే మాకు గౌరవం ఉందని, పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయని కవిత వంటి వారితో కూర్చుని మీ గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని అన్నారు. కేంద్రానికి బీసీ బిల్లును పంపించామని దాన్ని ఆమోదింపజేసుకునేందుకు ఆర్. కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ తీసుకోవాలని మోడీని అందరం కలుద్దామన్నారు. కవిత చేపట్టిన బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలన్న ఆర్.కృష్ణయ్య పిలుపుకు మంత్రి పొన్నం ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande