న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.) ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ కఠినమైన విధానాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి స్పష్టం చేసిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ దృఢవైఖరిని ఆపరేషన్ సిందూర్ నిరూపించిందని వ్యాఖ్యానించారు. భారత్పై ఉగ్రదాడులను సహించేది లేదన్నారు. ముష్కరులు ఎక్కడ నక్కినా అంతం చేస్తామని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. 'భారత్పై ఉగ్రదాడులను సహించేది లేదు. మన దేశంపై దాడులకు పాల్పడిన ముష్కరులు ఎక్కడ నక్కినా విడిచిపెట్టం. పాకిస్థాన్తో జరిగిన ఘర్షణలో భారతదేశంలో తయారైన ఆయుధాలు తమ ప్రభావాన్ని చూపించాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించాం. సైనిక అవసరాల కోసం విదేశాలపై మనం ఇప్పుడు తక్కువగా ఆధారపడుతున్నాం. ఆపరేషన్ సిందూర్లో దీని ప్రభావం కనిపించింది. దేశీయంగా తయారైన ఆయుధాలతో 22 నిమిషాల్లోనే పాకిస్థాన్ను మన సైన్యం మోకాళ్లపై కూర్చోబెట్టింది. భారతీయుల రక్తాన్ని పారించిన ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడా సురక్షితం కాదని నిరూపించాం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్