అమరావతి, 25 జూన్ (హి.స.) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని ఆయన వివరించారు.
ఈ ఘటనపై జనసేన నాయకులు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టయిన వారిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన కర్రి వెంకట సాయి వర్మ, మచిలీపట్నం మండలం వలందపాలెం గ్రామానికి చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్లోని సరూర్నగర్ సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్ ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి