హైదరాబాద్, 3 జూన్ (హి.స.)
మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి ఖండాంతరాలు దాటిందని ఇది చూసి ఓర్వలేక కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. వారి మీద వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి మిస్ వరల్డ్ పోటీల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెల నుండే వారు పిల్లి శాపనార్థాలు పెడుతూ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మిస్ వరల్డ్ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి సహకారం అందించామని ప్రజల భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమాలు జరిగాయన్నారు. రామప్ప, పోచంపల్లి, వెయ్యి స్థంబాల గుడి, కాకతీయుల కోట, ఓల్డ్ సిటీ సందర్శించడం తెలంగాణ చరిత్రాత్మక ద్వారా తెలంగాణ గౌరవం పెరిగిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణను ప్రపంచమే గుర్తించే విధంగా జరిగాయని చెప్పారు. రాజకీయాలు వేరు వచ్చిన అతిథులు గౌరవించుకునే అంశం వేరని కానీ కొంత మంది ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్